31-01-2025 01:35:38 AM
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): మోసానికి కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అభివర్ణించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వ అసమర్థతను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి బహిరంగంగానే అంగీకరించారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను ఎందుకు పక్కన పెట్టిందని నిలదీశా రు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్ని కలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాం గ్రెస్ పార్టీ ఒక్క తెలంగాణలోనే కాదని, ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ప్రదేశ్లోనూ ఇలాంటి మోసాలే జరుగు తున్నాయని విమర్శించారు.
విశ్రాంత ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, విశ్రాంత గవర్నమెంట్ సర్వెంట్స్ అని చూడకండా వారిని క్షోభ పెట్టడం మంచిది కాదన్నారు. వారికి వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. ఎన్నికల్లో పట్టభద్రులు తమ పార్టీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, సరోత్తమ్రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.