calender_icon.png 21 October, 2024 | 7:24 AM

దేశంలో అతిపెద్ద ఫేక్ న్యూస్ ప్రచారకర్త కాంగ్రెస్

21-10-2024 01:46:09 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద ఫేక్ న్యూస్ ప్రచారకర్తగా కాంగ్రెస్ పార్టీ మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రైతులను కాంగ్రెస్ అన్ని విధాలా మోసం చేసిందని ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. తెలంగాణలో 40 లక్షల రైతులకు రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ చేసిన ట్వీట్ పై స్పందించిన బండి.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంకా చేయలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు పంట రుణమాఫీ జరగలేదని, ఈ పథకం పూర్తిగా ఫ్లాప్ అని రాష్ర్ట ప్రభుత్వానికి కూడా తెలుసని పేర్కొన్నారు. కాంగ్రెస్ బూటకపు ప్రచారాన్ని మోదీ బయటపెట్టారని తెలిపారు.

ఖరీఫ్‌కు రైతు బంధు ఇవ్వలేదని, పథకం ప్రారంభించిన తర్వాత ఇది మొదటిసారి కావడం ప్రభుత్వానికి అవమానకరమని అన్నారు. కనీస మద్దతు ధర మీద రూ.500 బోనస్ అనే హామీ రైతులకు కాంగ్రెస్ చెప్పిన అతి పెద్ద జోక్ తప్ప విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన అబద్ధాలతో దేశాన్ని ఎంతకాలం మోసం చేస్తుందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.