08-04-2025 01:38:01 AM
పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): బీజేపీ మతతత్వ విధానాలను అవలంబిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ సిద్ధాం తాలను ఆచరిస్తోందని, ఆ సిద్ధాంతాలనే ముందుకు వెళ్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు.
తమ పార్టీ నాయకుడు రాహుల్గాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్నారని, ఈ కార్యక్రమాలను రాష్ట్రంలో పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పెద్దఎత్తున చేపడుతున్నారని తెలిపారు. ఈ నెల 11న మహాత్మాజోతిరావు ఫూలే, 14న అంబేద్కర్ జయంతులను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. అంబర్పేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెలలోనే ఆవిష్కరిస్తామని, సీఎం రేవంత్రెడ్డి,మంత్రులను ఆహ్వానిస్తామన్నారు.