calender_icon.png 25 October, 2024 | 7:55 AM

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి

12-09-2024 02:49:48 PM

17వ తేదీ నుంచి జరిగే ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. 

 సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర.. 

 కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు 

టీఎన్జీవో సంఘం నేతలతో ఆత్మీయ సమ్మేళనం 

కరీంనగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులంతా కంకణ బద్ధులై ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.  గురువారం వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ లోని తన ఇంటికి టీఎన్జీవోల సంఘం రాష్ట్ర నేతలతో పాటు జిల్లా నాయకులు, ప్రతినిధులను బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించారు.  ఈ సందర్భంగా వారితో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వెలిచాల రాజేందర్ రావు మాట్లాడారు.

ఉద్యోగుల సహకారంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు విజయవంతం అవుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు చిత్తశుద్ధితో విజయవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తో పాటు టీఎన్జీవో సంఘం నాయకులను వెలిచాల రాజేందర్ రావు సన్మానించారు. మారం జగదీశ్వర్, ఉద్యోగ సంఘాల నేతలు కరీంనగర్ మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు వెలిచాల జగపతి రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. టీఎన్జీవో సంఘం నాయకులు పలు సమస్యలను వెలిచాల రాజేందర్ రావు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా రాజేందర్ రావు  మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తాను స్థానికంగా కరీంనగర్ లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. తన తండ్రి జగపతిరావు గారితో  ఉద్యోగులకు ఉన్న అనుబంధాన్ని ఆత్మీయంగా పంచుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ఉద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటానని వెలిచాల రాజేందర్ రావు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో టీన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్ ప్రభాకర్ రెడ్డి, టిజిఓ నాయకులు కాళీ చరణ్, మామిడి రమేష్ అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మేందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ తిమ్మాపూర్ అధ్యక్షుడు పోలు కిషన్ జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, భీమ్రావు రాజేశ్వరరావు, మల్కా రాజేశ్వరరావు, గాలి సత్యనారాయణ, శంకర్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి కార్యదర్శి శంకర్, తదితరులు పాల్గొన్నారు.