08-04-2025 01:16:46 AM
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్రెడ్డి
నాగార్జున సాగర్/త్రిపురారం, ఏప్రిల్ 7 : అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. త్రిపురారం మండల కేంద్రం, మాటూరు, డొంకతండాలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టు బడి, రైతుల పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
సన్నధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాకు రూ. 500 ప్రభుత్వం బోనస్ ఇస్తున్నదన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.
అంతకుముందు అనుముల మండలం చింతగూడెం గ్రామంలోని రేషన్ లబ్ధిదారురాలి ఇంట్లో సన్నబియ్యంతో ఎమ్మెల్యే భోజనం చేశారు. అదేవిధంగా త్రిపురారం మండలం మాటూరులో రూ. 20 లక్షలతో నిర్మించిన పీహెచ్సీ సబ్ సెంటర్ భవనాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.