calender_icon.png 1 April, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల గోస వినని కాంగ్రెస్ ప్రభుత్వం

29-03-2025 01:01:00 AM

ధ్వజమెత్తిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

నిజామాబాద్, మార్చి 28 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని,  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. కారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీలు ఇచ్చారని ప్రస్తుతం ఒకటి కూడా నోచుకోలేదని ఆయన అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు నగరంలోని ధర్నా చౌక్ లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు పాల్గొన్నారు. ప్రశ్నించారు. పంటలకు నీరు లేక రైతులు కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం సుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో రైతులకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందించలేదని, ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు కంట నీరు పెడతున్నారని సూర్యనారాయణ మండిపడ్డారు. అకాల వర్షాలు, కరెంట్ కొరత కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని, ఎకరానికి రూ.30,000 నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో పసుపు రైతుల కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు మౌనంగా ఉండటం దురదృష్టకరమన్నారు. వరి కోతలు ప్రారంభమైనందున వెంటనే ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి, సకాలంలో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.

బస్తాలు, లారీలు తదితర సదుపాయాలు సమకూర్చాలని అన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోని ఈ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసి, సమస్యలను పరిష్కరించాలి అని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఇందూరు జిల్లా అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు,రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,ఈ మండల నాయకులు, కిసాన్ మోర్చా రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చాల జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.