calender_icon.png 1 October, 2024 | 3:01 PM

హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు

10-09-2024 04:17:17 AM

  1. పేదల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు 
  2. బీజేపీ సభ్యత్వ నమోదులో కరీంగగర్ టాప్‌లో ఉండాలి 
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్

కరీంనగ్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు.

తాను మొదట హైడ్రాకు మద్దతు తెలిపానని, పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలు, విల్లాలు, ఫాంహౌజ్‌లను కూలిస్తే సమర్థించానని చెప్పారు. కానీ పొట్ట కూటి కోసం ఏర్పాటు చేసుకున్న షాపులను, పేదల ఇళ్లను కూలుస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవన్నీ ప్రభుత్వ హైడ్రామాలని మండిపడ్డారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు ముందు అనుమతి ఇచ్చి, ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని కోరారు.

కాగా ఈసారి బీజేపీలో మరో 10 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలని హైకమాండ్ నిర్ణయించిదని అన్నారు. తెలంగాణలో 77 లక్షల మంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారని, వాళ్లందరినీ సభ్యులుగా చేర్చాలని కార్యకర్తలకు సూచించారు. సభ్యత్వ నమోదులో కరీంనగర్ పార్లమెంట్ అగ్రభాగాన ఉండాలని చెప్పారు. 

కేసీఆర్ యాగాలు చేసినా ఉపయోగం లేదు

బీఆర్‌ఎస్ అవుట్ డేటెట్ పార్టీ అని, రాష్ట్ర ప్రజలంతా బీఆర్‌ఎస్‌కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని, కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విరక్తి మొదలైందని, అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి వ్యతిరేక ఎదుర్కొంటున్నదిన చెప్పారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. దేశం ఫస్ట్, పార్టీ నెక్ట్స్.. వ్యక్తి లాస్ట్ అనే నినాదంతో పనిచేస్తున్న బీజేపీలో ప్రతి ఒక్కరూ చేరాల్సిన అవసరం ఉందన్నారు. జైనూరులో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి చేసిన గుండాలను ఎంఐఎం సమర్థిస్తుండటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు అంటోనిరెడ్డి పాల్గొన్నారు.