మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఏండ్లుగా బీసీలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు ఇప్పుడు కులగణన గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏ పార్టీ నోట విన్నా ఓబీసీలకు అన్యాయం జరిగిందని అంటున్నాయని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసమే ఓబీసీలను వాడుకుంటున్నాయని తెలిపారు.
ఓబీసీల గణన జరిగితే ప్రభుత్వాలపై తిరుగుబాటు వస్తుందని భయపడుతున్నారని వాపోయా రు. కులగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండగా ఇంతవరకు ఎందుకు చేపట్ట లేదని ప్రశ్నించారు. బీహార్, మహారాష్ర్టలో ఓబీసీ కులగణన చేస్తామంటే కేంద్రం ఒప్పుకోలేదన్నారు.
బీహార్లో 63.1 శాతం ఓబీసీ లు ఉన్నట్లుగా కులగణనలో తేలిందన్నారు. మండల్ కమీషన్ సిఫార్సులను అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉండాలన్నారు.