05-03-2025 12:31:21 AM
మహబూబాబాద్, మార్చి 4 (విజయ క్రాంతి) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు జరిగిన ఐదవ రాష్ట్రస్థాయి బేస్ బాల్ సబ్ జూనియర్ బాల బాలికల పోటీల్లో రాష్ట్రస్థాయి లో రన్నర్స్ గా నిలిచిన బాలుర జట్టును మంగళవారం ఐ.డి.ఓ.సి లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అడిషనల్ కలెక్టర్ వీర బ్రహ్మచారి అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గతంలో సీనియర్ బేస్ బాల్ పోటీల్లో కూడా మూడో స్థానం సాధించారని, ఇప్పుడు సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు.
భవిష్యత్తులో ప్రథమ స్థానంలో నిలిచి మహబూబాబాద్ జిల్లా పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో బెస్ట్ పిక్చర్ గా అవార్డు అందుకున్న కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ విద్యార్థి పరమేష్ ను, జిల్లా బేస్బాల్ క్రీడాకారులను పథకాలు సాధించేలా ప్రోత్సహిస్తున్న మహబూబాబాద్ జిల్లా సెక్రెటరీని ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ అభినందించారు. ఇంకా మరెన్నో పథకాలు సాధించేలా నిత్య సాధన చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు. క్రీడాకారులను, జిల్లా అసోసియేషన్ ను కలెక్టర్ మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బేస్ బాల్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా సెక్రెటరీ కల్లూరి ప్రభాకర్, డివైఎస్ఓ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.