- జిల్లా, డివిజన్ అధికారుల మధ్య వైరం
ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా కార్యాలయం సాక్షిగా గొడవపడిన ఆశాఖ అధికారులు
వాటాల పంపిణీలో తేడాతో గొడవకు కారణమనే ఆరోపణ
దురుసుగా ప్రవర్తించాడని తెలుపుతున్న డివిజన్ అధికారి
సూర్యాపేట, ఫిబ్రవరి2 (విజయక్రాంతి): నిబద్ధతగా విధులు నిర్వహించి ప్రజలకు ఆదర్శగా నిలువల్సిన ఓ శాఖ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయా..? అంటే అవునని తెలుస్తోంది. జిల్లా ఆర్డబ్ల్యూస్ ఇంట్రా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఈఈ, డీఈలు జిల్లా కార్యాలయం సాక్షిగా ఒకరిపై, మరోకరు దురుసుగా ప్రవర్తించుకున్నారని సమాచారం. వారి మద్య జరిగిన గొడవపై కొందరు ఉద్యోగుల సమక్షంలో పంచాయతీ సహితం నిర్వహించారని తెలుస్తోంది. ఈ గొడవకు అక్రమ వసూళ్లే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.
గొడవకు కారణం ఏమిటి...?
సూర్యాపేట ఆర్డబ్ల్యూస్ ఇంట్రా జిల్లా కార్యాలయం ఇమాంపేట సమీపంలో ఉంది. గత నాలుగు రోజుల క్రితం ఈ కార్యాలయంలో ఈఈ శ్రీనివాస్రావు, సూర్యాపేట డివిజన్ అధికారి పాండు నాయక్లు ఒకరిపై మరొకరు గొడవకు దిగినట్లు సమాచారం. ఈ సమయంలో కార్యాలయంలో ఏఈతో పాటు మరికొందరు ఉద్యోగులు సహితం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇంతా జరుగతున్నా ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల మధ్య వాటాల పంపిణిలో తేడాలు రావడంతోనే గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ గొడవ వెనుక భారీగా అక్రమ ఆర్ధిక లావాదేవిలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గొడవ బయటకు రాకుండా కొందరు ఉద్యోగులు సమక్షంలో రాజీ కుదిర్చికున్నట్లు ప్రచారం.
ఆరోపణలు ఎన్నో...
జిల్లా అధికారి కార్యాలయంలో అక్రమ వసూళ్ల జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయ పరిధిలోని పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి పర్సేంటేజీల రూపంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం ఉన్నది. అదే విదంగా ఆశాఖలో విధులు నిర్వహిస్తున్న కొందరు ఉద్యోగులకు ప్రభుత్వం అద్దె వాహణాలను సమకూర్చింది. అయితే ఉద్యోగుల సొంత వాహనాలను వినియోగిస్తూ అద్దె వాహనాలుగా చూపి ప్రతి నెల రూ. 33 వేలు అక్రమంగా పొందుతున్నట్లు సమాచారం.
ఈ వాహనాలకు అద్దె చెల్లిస్తున్న డబ్బుల విషయంలో వాటాలు తేలక అధికారుల మద్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఈఈ శ్రీనివాసరావును వివరణ కోరగా కార్యాలయంలో ఏలాంటి గొడవ జరుగలేదని, పని విషయంలో అధికారిని మందలించవలసి వచ్చిందని, ఇది పూర్తిగా మా కార్యాలయ విషయమని తాఫీగా సమాధానం ఇచ్చారు.
నాపై గొడవకు వచ్చారు
జిల్లా అధికారి అయిన ఈఈ శ్రీనివాస్రావు నా వ్యక్తిగత విషయాల జోలికి వచ్చారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గొడవకు దిగారు. నేను కార్యాలయం నుంచి బయటకు వస్తూంటే ఎదురు తిరిగి గొడవపట్టారు. అక్కడే ఒక ఏఈతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు.
పాండు నాయక్, డీఈ