28-03-2025 01:39:33 AM
మహబూబాబాద్, మార్చి 27: (విజయ క్రాంతి ): సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదటమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు.గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాల పై సెర్ఫ్ సీఈఓ డి. దివ్య తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , అదనపు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో* తో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ యాసంగి మార్కెటింగ్ సీజన్లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపి కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ముఖ్య మంత్రి నిర్ణయించారని తెలిపారు.
ప్రస్తుతం 33 శాతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50 శాతానికి పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు.జిల్లాలలో ఇతర శాఖల ద్వారా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు చేయలేని పక్షంలో ఆ కేంద్రాలను ఐకేపి లకు బదిలీ చేయాలని, అదనపు వరి ధాన్యం దిగుబడి నేపథ్యంలో నూతన కేంద్రాల ఏర్పాటు సైతం స్వశక్తి మహిళా సంఘాలచే ప్రారంభించాలని కలెక్టర్ లకు తెలిపారు.
ఐకెపి కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమ శాతం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రి అందించాలని అన్నారు.నూతనంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినందుకు పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సిన కమీషన్ మహిళా సంఘాలకు అందడం లేదని దీనిపై జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమీక్ష నిర్వహించి పెండింగ్ కమీషన్ చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని, గన్ని బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు.
స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులకు సంబంధించి కూలీ క్రింద 50 రూపాయలు మాత్రమే వచ్చినట్లు మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారని, దీనిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పరిశీలన చేసి పెండింగ్ చెల్లింపులకు సంబంధించిన బిల్లులు సమర్పించేలా చూడాలని, ప్రభుత్వానికి సమర్పించిన ప్రతి బిల్లు చెల్లింపు పూర్తవుతుందని అన్నారు.
మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి నిర్ణయించారని, ముందుగా జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల స్థాయిలలో కూడా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు కార్యాచరణ ఉంటుందని ఆయన అధికారులకు తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి బజార్ కింద షాప్స్ ఏర్పాటుకు ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ లలో ప్రజలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండాలని, బజార్ ఎల్లప్పుడూ ప్రజలతో కిటకిటలాడేలా ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో సదరం పెన్షన్స్, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సిద్ధం, తదితర అంశాలపై సంబధిత అధికారులతో కలిసి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, జిల్లా మేనేజర్ కృష్ణవేణి, డిఈఓ ఏ.రవీందర్ రెడ్డి, జిల్లా హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, ఏపిడి జయశ్రీ, నలిని సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.