28-04-2025 02:02:37 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 27 : ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం విద్యార్థులకు ఆదివారం పలువురు దాతలు విరాళం అందజేశారు. కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ అంబికా రెసిడెన్సీకి చెందిన మన్నెం బుచ్చిరెడ్డి అనాథ విద్యార్థి గృహం విద్యార్థులకు రూ. 1,02,500 విలువైన ఐదు కంప్యూటర్లు , టెక్నికల్ వస్తువులు అందజేయడంతోపాటు వివిద తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజుల కోసం రూ. 50వేల నగదును అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ సమక్షంలో విరాళంగా అందచేశారు.
ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. అనాథ విద్యార్థి గృహం ఒక అద్భుతమైన వసతి గృహామని, అనాఊ పిల్లలను చేరదీసి వారికి భోజన, వసతి, విద్యా వైద్యంతోపాటు సకల సౌకర్యాలు కల్పిoచి, వారి భవిష్యత్తుకు నిరంతరంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
అమెరికాలో ఉంటున్న మా చిన్న కుమారుడు వరుణ్ కుమార్ రెడ్డి సహకారంతో అనాథ విద్యార్థి గృహం లోని 120 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా ఐదు కంప్యూటర్లు, వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజులు చెల్లించడానికి రూ. 50వేలు అందజేశామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దాత బుచ్చిరెడ్డి సతీమణి అరుణ, పెద్ద కుమారుడు వెంకట్ రామ్ రెడ్డి హాజరయ్యారు.