calender_icon.png 26 October, 2024 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలో ఎస్‌ఎల్బీసీ పూర్తి

13-08-2024 01:19:58 AM

అమెరికా నుంచి బేరింగ్, కటింగ్, స్పేర్ పార్ట్స్ 

రాబిన్స్ సంస్థ సీఈవోతో మంత్రి కోమటిరెడ్డి భేటీ

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతోపాటు కరువుతో వ్యవసాయానికి దూరమైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్‌ఎల్బీసీ టన్నెల్ పనులను రాబోయే రెండేళ్లలో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి సోమవారం అక్కడి ఒహియో రాష్ట్రంలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని సీఈవో లాక్‌హోంతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా టన్నెల్ తవ్వకానికి ఉపయోగించే అధునాతన నిర్మాణ మెషినరీని లాక్ హోం మంత్రికి చూపించి వాటి పనితీరును వివరించారు. అనంతరం లాక్‌హోంతో సమావేశమైన మంత్రి.. టన్నెల్ తవ్వకానికి ఇబ్బందిగా మారిన బేరింగ్‌తో పాటు ఇతర కటింగ్ విడిభాగాలను వీలైనంత త్వరగా సమకూర్చాలని కోరారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్ పూర్తయితే 3 లక్షల ఎకరాలకు ఎలాంటి పంపింగ్ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని, ఉదయ సముద్రంలో భాగమైన బ్రహ్మణవెల్లం ప్రాజెక్టు ద్వారా మరో లక్ష ఎకరాలకు పంపింగ్ ద్వారా సాగునీరు అందుతుందన్నారు. మొత్తంగా 4 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగించే ఈ టన్నెల్  పనులు.. బేరింగ్, ఇతర మరమ్మతుల కారణంగా ఆగిపోయాయని తెలిపారు.

ప్రభుత్వమే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నందున బేరింగ్‌తో పాటు ఇతర పరికరాలను వీలైనంత త్వరగా అందించాలని కంపెనీ సీఈవో లాక్‌హోంను వెంకట్‌రెడ్డి కోరారు. తవ్వకానికి అవసరమైన స్పేర్ పార్ట్స్ అందించడంలో ఆలస్యం జరుగుతున్న తరుణంలో స్వయంగా తానే రంగంలోకి దిగినట్లు వివరించారు. ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేందు కుగాను తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా బిల్లులు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నందని తెలిపారు. తక్షణం చెల్లింపులు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును బ్లాస్టింగ్ ప్రక్రియలో పూర్తి చేసే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రాబిన్స్ కంపెనీతో చర్చలు జరిపి పనులను ముందుకు తీసుకెళ్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.