10-04-2025 12:46:20 AM
వనపర్తి టౌన్ ఏప్రిల్ 9: వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో రహదారుల విస్తరణ పెండింగ్ పనులపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల నుండి పెబ్బేరు రోడ్డు వైపు రహదారి, పానగల్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, సహా మిగతా పెండింగ్ రహదారుల విస్తరణకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు.
సంబంధిత మార్గాల్లో ఉన్న ఇళ్లకు మార్కింగ్ ఇవ్వకపోతే వారంలోపు ఇవ్వాలని సూచించారు. ఆయా ఇళ్లకు సంబంధించి ఇదివరకే పరిహారం ఇచ్చి ఉంటే వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనులు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు దేశా నాయక్, సీతారామస్వామి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.