09-03-2025 12:23:54 AM
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్కు రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి
రాజేంద్రనగర్, మార్చి 8: మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా బ్యాటరీ కంపెనీ పరిశ్రమకు భూమిపూజ చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను రాష్ట్ర మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం తరఫున వినతులు అందించారు.
కేంద్రమంత్రిని కలిసిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు చామల కిరణ్కుమార్, బలరాంనాయక్, కడియం కావ్య ఉన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ వినతులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు.
వరంగల్కు రింగురోడ్డు ఇస్తామన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపామన్నారు. వికారాబాద్ రైల్వే లైన్పై స్పష్టత ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఖాజీపేట డివిజన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు చెప్పారు. డోర్నకల్ రైల్వేలైన్ వంతెన పూర్తికాలేదన్నారు.
తెలంగాణలో 3 బ్యాటరీ తయారీ క్లస్టర్లు
అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. తయారీ రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 3 బ్యాటరీ తయారీ కస్టర్ల తయారీకి సహరిస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే దివిటిపల్లిలో ఎలక్ట్రికల్ బ్యాటరీ కంపెనీ భూమి పూజకు వెళ్తున్నట్టు చెప్పారు.