calender_icon.png 30 September, 2024 | 4:59 PM

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

30-09-2024 02:43:28 PM

అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్

వనపర్తి, (విజయక్రాంతి):  వనపర్తి జిల్లా ప్రజావాణి ఫిర్యాదులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.  సోమవారం ఉదయం అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రి ప్రజావాణిలో చేసుకున్న ఫిర్యాదులను అక్టోబర్, 3 నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. 

ముఖ్యమంత్రి ప్రజావాణి నుండి జిల్లాకు ఇప్పటి వరకు ఆయా శాఖలకు సంబంధించిన 297 ఫిర్యాదులు రావడం జరిగిందని, వాటిని సంబంధిత శాఖలకు పంపించగా ఇప్పటి వరకు 114 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయని ఇంకా 183 ఫిర్యాదులు ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉన్నట్లు తెలియజేశారు.  ఎక్కువగా రెవెన్యూ శాఖలో పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు.  ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడమే కాకుండా ఫిర్యాదు దారుని పూర్తి వివరాలు,  సమస్య పరిష్కారంతో ఫిర్యాదు దారుని మనోభావాలు, స్పందనను సమర్పించాల్సిందిగా సూచించారు. అదేవిధంగా జిల్లా ప్రజావాణి ఫిర్యాదులను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ రోజు మొత్తం  55 ఫిర్యాదులు వచ్చాయి.  జిల్లా అధికారులు, మండలాల నుండి వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీఓ లు తదితరులు పాల్గొన్నారు.