28-04-2025 07:49:30 PM
సమాచారం ఇవ్వడంలో అలసత్వం ఎందుకు..?
(AAS) జిల్లా ఇంచార్జ్ బోడికల ప్రేమ్ దయాళ్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అధికారులు జవాబుదారీ తనం కోల్పోతున్నారు. ప్రజలకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉత్తరం ద్వారా సోమవారం అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆజాద్ అధికార్ సేన పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ బోడికల ప్రేమ్ దయాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓ కీలక విభాగం యొక్క సమాచారం కోసం పౌర సమాచార అధికారికి సహా చట్టం 2005 అనుసరించి గత ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోగా సంబంధిత గడువులోగా సమాచారాన్ని ఇవ్వలేదన్నారు.
దీంతో గత ఏడాది ఏప్రిల్ 9వ తేదీన పోస్ట్ ద్వారా అప్పీలు చేయగా, అప్పిలేట్ ఆఫీసర్, (IDOC) నవభారత్ అను చిరునామాకు పంపగా కనీసం దరఖాస్తు కూడా పరిశీలించకుండా అదే పోస్టుపై (insufficient address) ఇన్ సఫిసెంట్ అడ్రస్ అంటూ తిరిగి పోస్ట్ పంపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమాచారం దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగా ఆర్థిక నష్టంతో పాటు సమయం వృధా కలిగించినందున సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ కు పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు.