గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను దర్శకుడు యదు వంశీ తెరకెక్కించగా, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టులో రానున్న ఫ్రెండ్షిప్ డే వీక్ సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే నెల 9న విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటించిన చిత్ర సమర్పకురాలు నిహారిక మూవీ విశేషాలను పంచుకున్నారు.
‘న్యూ టాలెంట్ను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఎక్కువ మంది కొత్త వాళ్లతోనే సినిమాను పూర్తి చేశాం. యదు వంశీగారు మంచి ప్లానింగ్తో సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేయటం అభినందనీయం’ అని నిహారిక అన్నారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ ‘11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తున్నాం. వారి మధ్య స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్లెటూరిలోని రాజకీయాలు, యువత పడే సంఘర్షణ అన్నింటినీ ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఫ్రెండ్స్తో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా, సెలబ్రేట్ చేసుకునేలా సినిమా ఉంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.