calender_icon.png 24 October, 2024 | 7:48 AM

బెయిల్‌పై వచ్చి ప్రచారం చేస్తున్నారు

05-05-2024 12:46:08 AM

వారే ఇండియా కూటమి స్టార్ క్యాంపెయినర్లు

బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి) : ఇండి కూటమికి చెందిన స్టార్ క్యాంపెయినర్లు బెయిల్‌పై వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. ఆర్థిక నేరాలు, ఏసీబీ, మనీలాండరింగ్, పరువు నష్టం దావా కేసుల్లో శిక్షపడి బెయిలుపై బయటకు వచ్చిన వారు ఇండి కూటమి తరఫున లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ బెయిల్‌పై బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారని, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు బెయిల్‌పైనే ఉన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక కేసుల్లో బెయిల్‌పైనే బయట ఉన్నారని తెలిపారు. బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తులు తాము ప్రజలకు గ్యారెంటీ అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఫైరయ్యారు. ఇలాంటి నాయకులు ప్రచారంలో మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరని పేర్కొన్నారు.