15-04-2025 09:01:42 PM
బహిరంగ సభతో కాంగ్రెస్ కి దిమ్మతిరగాలి..
హామీలు నెరవేర్చే వరకు పోరాడతా... ఎన్ని కేసులు పెట్టిన సిద్ధం..
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 27న తలపెట్టిన బహిరంగ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ సభ రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో సభకు ప్రజలు తరలి వస్తున్నారన్నారు, అన్ని నియోజకవర్గాల కంటే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ప్రజలు హాజరై ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను చూపించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కరన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, 16 నెలలు గడిచిన ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టేదే లేదని, హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తనపై కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టిన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ముఖ్యంగా రైతులకు రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ బందు పెట్టిందన్నారు. కేసిఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల కరెంటు విషయంలో పూర్తిగా అన్యాయం చేస్తుందన్నారు. బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా చేయాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాల పట్ల రాష్ట్ర ప్రజలు విరక్తి చెంది ఉన్నారని, రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెబుతారని అన్నారు. ఇకపై రాబోయే ప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అద్భుతంగా విజయాలు సాధిస్తుందని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ దే అధికారం అని భీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, అపరాధ ముత్యంరాజు, ములుగు సృజనాపూర్ణ చందర్, కిషన్, కల్లపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, ఆర్కే రమేష్, కొండపాక శ్రీనివాస్, సబ్బని రమేష్, పట్టణంలోని అన్ని వార్డుల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.