18-04-2025 12:33:00 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 17 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని వివిధ కాలనీల్లో ప్రజలకు మురుగునీరు, మురుగు వాసన నుంచి విముక్తి లభిస్తుందని కార్పొరేటర్ లచ్చిరెడ్డి తెలిపారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని బృందావన్ మెడోస్, శ్రీ శ్రీనివాస కాలనీ, జక్కిడి నగర్ కాలనీల్లో గురువారం కార్పొరేటర్ లచ్చిరెడ్డి, జలమండలి జీఎం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థలేని కాలనీలకు నూతన డ్రైనేజ్ పైప్ లైన్ త్వరలో ప్రారంభమవుతుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే డ్రైనేజీ పనులు ప్రారంభించాలని జలమండలి అధికారులను కోరారు.
జూలై మండలి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బృందావన్ మెడోస్, శ్రీ శ్రీనివాస కాలనీ మీదుగా జక్కడి నగర్ కాలనీ నుంచి బ్యాంక్ కాలనీలోని శ్రీ వైష్ణవి మెడికల్ షాపు వరకు భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
శనివారం పనులను జలమండలి సీజీఎం పరిశీలిస్తారని, సోమవారం డ్రైనేజ్ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి డీజీఎం రాజగోపాల్, మేనేజర్ సిరివెన్నెల, బృందావన్ మెడోస్ కాలనీ సంఘం అధ్యక్షుడు శశికాంత్, శ్రీ శ్రీనివాస కాలనీ సంఘం అధ్యక్షులు చిత్రంజన్, జక్కిడి నగర్ కాలనీ సంఘం అధ్యక్షులు యాదిరెడ్డి, సౌభాగ్యనగర్ కాలనీ సంఘం మాజీ అధ్యక్షుడు నందకిశోర్, కాలనీ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, జగన్మోహన్ చారి, శర్మ తదితరులు ఉన్నారు.