రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆదివారం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితులపై ఆయా జిల్లాల అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లా అధికారుల బృందం సహాయక చర్యలలో పాల్గొనాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పునరావాస ఏర్పాట్లలో నిమగ్నం కావాలని సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా రెస్క్యూటీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కలెక్టరేట్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా కావాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి తెలిపారు.