07-03-2025 12:10:38 AM
కరీంనగర్, మార్చి 6 (విజయక్రాంతి): నగరంలోని మంకమ్మతోట దన్గర్వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతూ కోతి వస్తుందన్న భయంతో మొదటి అంతస్తు నుంచి దూకిన బాలుడిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం ధన్గర్ వాడి పాఠశాల 8వ తరగతి విద్యార్థి రఘువర్ధన్ పాఠశాలలో ఉండగా కోతి రావడంతో మొదటి అంతస్తు నుంచి కిందకి దూకాడు. దీంతో అతడి కాలి ఎముకలు విరిగాయి. కొద్దిరోజులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బాలుడిపై ప్రత్యేక శ్రద్ధ చూపి కరీంనగర్లో మెరుగైన చికిత్స ఇప్పిస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రఘు వర్ధన్ తో మాట్లాడారు. భయం వీడాలని, బాగా చదువుకోవాలని సూచించారు. అవసరమైన పుస్తకాలు తెప్పిస్తానని చెప్పారు. అనంతరం ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న క్రిటికల్ కేర్ విభాగాన్ని సందర్శించారు. ఈ భాగంలో రోగుల కోసం ఏర్పాటు చేయబోయే సౌకర్యాలు పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ కు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ ఎం ఓ డాక్టర్ నవీనా ఉన్నారు.