18-02-2025 12:00:00 AM
మహదేవపూర్, ఫిబ్రవరి 17 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల మండలమైన పలిమెల మండలంలో ఇంచంపల్లి వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టును సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.మండలం ముకునూరులో గ్రామంలో పర్యటించి పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు పరిశీలించి విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతమైన తిమ్మేటి గూడెంలలో ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రం, గ్రంధాలయం, గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు.
ఉపాద్యాయుల విధులు, మధ్యాన్న భోజనం, మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు, పెన్సిల్స్, పరీక్షా ప్యాడ్స్ పంపిణీ చేశారు. పాఠాలు చదివించి బాగా చదవాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని పరిశీలించి గ్రంథాలయానికి అవసరమైన ర్యాక్స్, కుర్చీలు, పోటీ పరిక్షాలకు అవసరమైన పుస్తకాలు ఏర్పాటు చేస్తానని అన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలు చెప్పే పద్యాలను విని అభినందించారు. అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరగా, సంక్షేమ అధికారి ద్వారా ప్రతిపాదనలు పంపాలని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రాథమిక పాఠశాలలను సందర్శించి పాఠశాల విద్యార్థులతో మాట్లాడి మద్యాన్న భోజనం చేశారా, మెనూ ఏమి పెట్టారు, బావుందా అని అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించారు. డిజిటల్ క్లాస్ ను పరిశీలించి విద్యా ర్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్య అందించాలని ఉపాధ్యాయులను అదేశించారు. పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థుల వివరాలు ఆపార్లో నమోదులు చేయాలని ఆదేశించారు. పాఠశాలకు ఎక్కువ మంది విద్యార్థులు గైరాజరు అయ్యారని, విద్యార్థులు క్రమం తప్పక పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తల్లిదండ్రులుకు అవగాహన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులు పాఠశాలలు కు వచ్చేలా చూడాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, కిటికిలకు తలుపులు, గ్రీన్ బోర్డ్స్, మరమ్మతులు తదితర సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తరువాత నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపిడిఓ శ్రీనివాసరావు, ఎపిఓ ప్రకాష్ రెడ్డి, సీడీపీఓ రాధిక, ఏపీఎం సునీత పంచాయతి కార్యదర్శి వినయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.