calender_icon.png 30 September, 2024 | 12:57 AM

సమన్వయంతో సంక్షేమ, అభివృద్ధిలను పూర్తి చేయాలి

09-09-2024 06:34:27 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లక్ష్యాలను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల లక్ష్యాల సాధనలో అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. కాగజ్ నగర్ డివిజన్ కు సబ్ కలెక్టర్ ను నియమించినందున డివిజన్ లో జరిగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులలో అధికారులు తమ వంతు సహకారం అందించాలని తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని గ్రామ పంచాయతీలలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, మంచినీటి బావులు, నీటి ట్యాంకులలో క్లోరినేషన్ చేయాలని తెలిపారు. గ్రామాలలో గ్రామాలలో విష జ్వరాల నియంత్రణపై పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనుమానితుల నుండి రక్త నమూనాలు సేకరించి అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలను సందర్శించి సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో ముందుకు తీసుకువెళ్లాలని, జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.