18-03-2025 03:18:24 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎల్ఆర్ఎస్-2020 పథకం(LRS-2020 Scheme)లో రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre) అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ తో కలిసి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసుకొని క్రమబద్దీకరణ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించిందని, 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
నూతన ఇంటి నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ చెల్లించవలసి ఉంటుందని, తద్వారా బ్యాంకు రుణ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో 78 మంది దరఖాస్తుదారులకు గాను 3 మంది మాత్రమే ఆన్ లైన్ ద్వారా చెల్లించారని, ఈనెల 31వ తేదీలోగా రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభ్యర్థులు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని నర్సరీని సందర్శించి మొక్కల నిర్వహణను పరిశీలించారు. మొక్కల పెంపకంలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, విత్తన అభివృద్ధి, మొక్కల పెంపకం అంశాలలో శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.
విత్తనాలు నాటుతున్న భూమి వివరాలు తెలుసుకొని ప్రతిరోజు సకాలంలో నీటిని అందించాలని తెలిపారు. నర్సరీలో నాటిన విత్తనాలు మొలకెత్తక పోవడంపై 2 రోజులలో నివేదిక అందించాలని ఎ. పి. ఎం. ను ఆదేశించారు. మొక్కలు నాటేందుకు మరో 2 నెలల గడువు ఉన్నందున నర్సరీలలో విత్తనాలు త్వరగా మొలకెత్తేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొక్కల పెంపకంపై అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మౌనిక, ఈ.జి.ఎస్. ఎ.పి.ఎం. చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.