హనుమకొండ: హనుమకొండ బాలసముద్రంలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని, నిమగ్నమై సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు జరుగుతున్న కాళోజీ కళాక్షేత్రంలోని ఆడిటోరియం, పెయింటింగ్, టైల్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫ్యాబ్రికేషన్, ఆర్ట్ గ్యాలరీ, తదితర అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించి వాటి పురోగతికి సంబంధించిన వివరాలను ఆర్అండ్ బి, ఇతర శాఖల అధికారులతో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని, వాటర్ ట్యాంకులు, వాటికి సంబంధించిన పనులను పకడ్బందీగా చేయాలన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్మాణ పనులకు సంబంధించి వాటి పురోగతి వివరాలను తనకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.