16-04-2025 05:10:43 PM
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి..
హుజురాబాద్ (విజయక్రాంతి): ధాన్యం సేకరించిన వివరాలు, మిల్లుకు పంపే ధాన్యం వివరాలకు సంబంధించిన రిజిస్టార్లు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తూకం యంత్రాలు, తేమ యంత్రాలు పనితీరును పరిశీలించారు. కల్లాల వద్ద సన్నాలు, దొడ్డు రకం ధాన్యాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలని రైతులకు సూచించారు.
నిర్దిష్ట తేమ శాతానికి రాగానే ధాన్యం కొనుగోలు చేయాలని సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కటింగు కోతలు లేకుండా కొనుగోలు జరపాలన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తార్పల్లిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. 48 గంటలలో రైతులకు దాన్యం వచ్చేలా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలకు వచ్చే మహిళలకు ఉపాధి హామీ కూలీలకు ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మెడికల్ సిబ్బందికి సూచించారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, తాసిల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏవో సౌమ్యతో పాటు తదితరులు ఉన్నారు.