మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలి..
మార్కెట్ ను స్టడీ చేయండి..
డిమాండ్ ఉన్న ఉత్పత్తులను తయారు చేయండి..
కష్టపడండి.. మంచి పేరు తీసుకురండి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: స్వశక్తి మహిళలను మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ప్రభుత్వము కోటీశ్వర్లను చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని నవ భారతి మండల సమైక్య కార్యాలయంలో మహిళా శక్తి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు మంచి వ్యాపార రంగాన్ని నేర్చుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో ఆ ఉత్పత్తులపై సమగ్రంగా స్టడీ నిర్వహించాలని పేర్కొన్నారు. ఆ మేరకు వాటి ఉత్పత్తులను తయారు చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. మహిళా శక్తి కార్యక్రమాన్ని మహిళలంతా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తో మహిళా వ్యాపారవేత్తలుగా మారెందుకు చక్కని అవకాశమని, దాన్ని నిరూపించుకోవాలని సూచించారు. కోటి మంది ని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అందుకోసమే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.
మైక్రో ఎంటర్ప్రైజెస్ కింద ఏదైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కష్టపడి నిజాయితీగా పని చేయండి.. మీకు మంచి గుర్తింపు వస్తుందని ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వారు చేస్తున్న సమయం ఉపాధి పనులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా శక్తితో మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు.