యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలైన సందర్భంగా భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాలలో ఏర్పాటు చేసిన ఆయా పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే గురువారం పరిశీలించారు. వెన్నెల కళాశాలలో జరుగుతున్న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అక్టోబర్ 5వ తేది వరకు నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటివరకు మన జిల్లాకు సంబంధించి 629 అభ్యర్థులకు గాను 194 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి అయినట్లు కలెక్టర్ తెలిపారు. కమిటీల ద్వారా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా విద్యా అధికారి సత్యనారాయణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.