calender_icon.png 20 September, 2024 | 6:05 PM

మల్లమ్మ కుంట రిజర్వాయర్ స్ధలాన్ని పరిశీలన...

20-09-2024 03:22:27 PM

జిల్లా కలెక్టర్ సంతోష్

గద్వాల,(విజయక్రాంతి): వడ్డేపల్లి మండలంలోని తనగల గ్రామంలో నిర్మించవలసిన మల్లమ్మ కుంట రిజర్వాయర్ ప్రదేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస రావుతో కలికి జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం అవసరమైన స్థలంలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది. పట్టా భూమి ఎంత ఉందన్న వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ మ్యాప్‌ను సమీక్షించి నీటి పంపిణీ మార్గాలు, ప్రత్యేకంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా పంపింగ్ స్టేషన్ల స్థానం, వాటి సామర్థ్యం, రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం, సహజ అవరోధాలు, బండ్ నిర్మాణం మరియు నీటి నిల్వ సామర్థ్యం వంటి అన్ని కీలక అంశాలను విశ్లేషించి, ఆ విషయాలను అమలు చేయడానికి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలను అందించారు.

ప్రాజెక్టు నిర్మాణం వేగంగా మరియు సమర్థవంతంగా పూర్తయ్యేలా క్రమ పద్ధతిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం భూమి సేకరణ, పంపింగ్ స్టేషన్లు, బండ్ నిర్మాణం పద్ధతులను పకడ్బందీగా అమలు చేయాలని, సర్వే వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని కోరగా, వారికి న్యాయం చేసే విధంగా  సరైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  తగిన చర్యలు  చేపడతామన్నారు. కలెక్టర్ వెంట నీటి పారుదల శాఖ ఈ.ఈ. విజయ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ జోషి , అసిస్టెంట్ ఇంజినీర్లు తదితరులుపాల్గొన్నారు.