calender_icon.png 5 October, 2024 | 4:57 AM

వినాయక నిమజ్జన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలి

04-09-2024 05:59:40 PM

సంబంధిత అధికారులతో  కలెక్టర్ బి.ఎం సంతోష్ సమావేశం

గద్వాల,(విజయక్రాంతి): వినాయక చవితి వేడుకల సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు వినాయక నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసులుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఈసారి జిల్లాలో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

వినాయక చవితి నిమజ్జనం ఈసారి నది అగ్రహారం, జమ్మిచేడు, బీచుపల్లి, జూరాల డ్యాం ఈ నాలుగు ప్రదేశాల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. ఆర్.డి.ఓ, డి.ఎస్.పి నోడ్‌ల పాయింట్‌లుగా వ్యవహరించాలని సూచించారు. మండల తాసిల్దార్లు, పోలీస్ అధికారులు కలిసి గణేష్ ఆర్గనైజర్లతో సమన్వయం చేసుకోవాలని, అధికారులు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, అందుకు అవసరమైన రోడ్లను మరమ్మతులు చేపట్టాలని అన్నారు. గణేష్ నిమజ్జనం వద్ద సరైన బందోబస్తు ఏర్పాటు చేయాలనీ పోలీస్ అధికారులకు తెలిపారు. వైద్యాధికారులు నిమజ్జన ప్రదేశాల వద్ద వైద్య సేవలు అందించాడానికి  మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు  చేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు.

నది ప్రాంతంలో ఈతగాళ్లను అందుబాటులో ఉంచి, వారికి ప్రత్యేక టీ షర్ట్ లను అందజేయాలన్నారు. సంబందిత మండల తాసిల్దార్‌లతో మత్స్యశాఖ అధికారులకు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని  అన్నారు. పరిశుభ్రత, తాగునీరు ఏర్పాట్లు, రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేయలని పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాలలో లైటింగ్, పవర్ జనరేటర్లను మరియు బ్యారికేడింగ్ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గణేష్ వేడుకలు మొదలు నిమజ్జనం పూర్తయ్యే వరకు అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అగ్ని మాపక శాఖ అధికారులకు సూచించారు.

ఎక్సైజ్ అధికారులు నిమజ్జనం సమయంలో మద్యం షాపులను ముందుగానే మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు మాట్లాడుతూ... జిల్లాలో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని ,నిమజ్జన ప్రదేశాల వద్ద సీసీటీవీ కెమెరాలు మరియు కమాండ్ కంట్రోల్ బోర్డును ఏర్పాటు చేస్తామని అన్నారు. డి.జే. లకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు సమన్వయంతో గణేష్ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రామ చందర్, డి.ఎస్.పి సత్య నారాయణ, ఏవో వీరభద్రప్ప, ఇతర సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.