16-04-2025 12:19:21 AM
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : వేసవి కాలంలో పనుల మీద బయటకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామాలు, మండల కేంద్రాల్లో వేల సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అన్ని గ్రామా లు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 8090 చలి వేంద్రాలను ఏర్పాటు చేశారు. చలివేంద్రాల ఏర్పాటుపై అధికారులను మంత్రి సీతక్క ప్రశంసించారు.
అవసరమున్న ప్రతి చోట చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాం తాల్లో తాగు నీటికి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సొంత నిధుల నుంచి 31 జిల్లాల కలెక్టర్లకు కోటి రూపాయల చొప్పున ప్రత్యేక నిధులు కేటాయించారు.
అత్యవసర తాగునీటి అవసరాల కోసం ఈ ప్రత్యేక నిధిని ఆయా జిల్లా కలెక్టర్లు వెచ్చించనున్నారు. గతంలో ఫైనాన్స్ శాఖ నుంచి ప్రత్యేక నిధుల కోసం అనుమతులు ఇచ్చినప్పటికీ ఒక్క ఏడాది కూడా నిధులు విడుదల కానీ నేపథ్యంలో ప్రస్తుతం అత్యవసర తాగు నీటి అవసరాల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నేరుగా సొంత నిధులు కేటాయించిం ది. దీంతో ఏదైనా సమస్యతో మిషన్ భగీరథ నీరు అందకపోయినా తమకు కేటాయించిన ప్రత్యేక నిధిని ఖర్చు చేసి ప్రజలకు నీటి కష్టాలు రాకుండా కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు.