calender_icon.png 5 October, 2024 | 2:50 AM

కొకైన్ కింగ్‌పిన్ అరెస్టు

05-10-2024 12:47:55 AM

ఢిల్లీ డ్రగ్స్ రాకెట్ సూత్రధారి జస్సీ

అమృత్‌సర్ విమానాశ్రయంలో అరెస్టు

17 ఏండ్లుగా బ్రిటన్  నుంచి దందా

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఢిల్లీలో ఇటీవల భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు.. ఆ దందా నిర్వహిస్తున్న ముఠా మాస్టర్‌మైండ్‌ను శుక్రవారం అమృత్‌సర్‌లో అరెస్టు చేశారు. జితేంద్రపాల్ సింగ్ అలియాస్ జస్సీ (40) దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొన్నారు. ఇతడు 17 ఏండ్లుగా బ్రిటన్‌లో నివసిస్తున్నాడు.

అక్కడి నుంచే డ్రగ్స్ దందా సాగిస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో పోలీసులు 560 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ మరిజువానాను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.5,620 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, జస్సీ ఐదోవాడు. ఈ డ్రగ్స్ రాకెట్ నిందితులకు కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపిస్తున్నది.