శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ..
బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కుల పంపిణీ..
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరేకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పలు డివిజన్ల పరిధిలోనీ నిరుపేదలు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.3,30,000/- మూడు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో బాధితులకు చెక్కు రూపేణా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని తెలిపారు. ఈ మేరకు వైద్య చికిత్సకు సహకారం అందించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీం, రాజు యాదవ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.