కుక్కల స్వైర విహారంతో బయటకు వెళ్లలేకపోతున్నాం
మా సమస్యను ఎవరూ పట్టించుకోవట్లేదు
కుత్బుల్లాపూర్లో ప్ల్లకార్డులతో నిరసన తెలిపిన చిన్నారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): ‘సీఎం అంకుల్.. కుక్కల బారి నుంచి మా ప్రాణాలను కాపాడండి’ అంటూ కుత్బుల్లాపూర్లో చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వీధుల్లో కుక్కల స్వైర విహారంతో బయటకు వెళ్లలేకపోతున్నామని అధికారుల నిర్లక్ష్యంపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గత మంగళవారం జవహర్ నగర్లో వీధి కుక్కల దాడిలో 18 నెలల బాలుడి మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని చిన్నారులు కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని పలు కాలనీల్లో కుక్క లు స్వైర విహారం చేస్తూ కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు కాలనీలకు చెందిన చిన్నారులు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా సీఎం రేవంత్రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని చిన్నారులు ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. కాగా, కొందరు మాంసం దుకాణాల యజమానులు మాంసం వ్యర్థాలను ఖాళీ ప్రదేశాల్లో వేస్తుండడంతో, వాటిని తినడానికి అలవాటు పడిన కుక్కలు చెలరేగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. వ్యర్థాలను ఖాళీ ప్రదేశాల్లో పడవేయొద్దని హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను కోరారు.
నన్ను, మా మమ్మీని కుక్కలు కరిచాయి : చిన్నారి తన్విహా
సీఎం అంకుల్ స్కూల్కు వెళ్తున్న సమయంలో కుక్కలు నన్ను, మా మమ్మీని కరి చాయి. హాస్పిటల్కు వెళ్లి ఇంజక్షన్ వేయించుకున్నాం. మా కాలనీలో చాలా కుక్కలు ఉన్నాయి. వాటి నుంచి మమ్మల్ని కాపాడం డి. కమిషనర్ అంకుల్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీస్ అంకుల్కు ఫిర్యాదు చేస్తున్నామని తన్విహా అనే చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది.