calender_icon.png 5 October, 2024 | 6:55 PM

కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం

05-10-2024 04:18:05 PM

హైదరాబాద్: తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో.. లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదన్నారు. కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని తాను అధికారులను ఆదేశించానని చెప్పారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియమ్మను ఒప్పించారన్నారు. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో  గెలిచేందుకు కాకా సహకారం తీసుకున్నారని సీఎం గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారని మండిపడ్డారు. కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం అన్నారు. 80వేల మందికి పైగా నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకాదని సీఎం కొనియాడారు.

ఆనాడు సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి కాకా అన్నారు. జాతీయ స్థాయిలో నెహ్రూ ను చాచా అని పిలిస్తే.. రాష్ట్రంలో గడ్డం వెంకటస్వామిని కాకా అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ కాంగ్రెస్ కార్యాలయానికి తన ఇంటిని ఇచ్చేసిన కాంగ్రెస్ వాది కాకా అన్నారు.కాకా ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కాకా కుటుంబ సభ్యుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నది పార్టీ ఆలోచన అని సీఎం స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా..ప్రభుత్వం మిమ్మల్ని అనాథలను చేయదు.. మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్న సీఎం రేవంత్, రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు... ప్రభుత్వం  స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుందన్నారు. ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు పేదల ముసుగు అడ్డుపెట్టుకునే వారి మాటలు వినొద్దని సూచించారు. ఈ వేదికగా పేదలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా అన్న ముఖ్యమంత్రి మీ మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురికావద్దు.. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈటెల, కేటీఆర్, హరీష్ కు సూచన చేస్తున్నా.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వానికి ఎవరిపై కోపం లేదు.. ప్రజలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ఎజెండా అన్నారు. నరేంద్ర మోడీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు.. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు. కాకా స్పూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిద్దామన్నారు.. కేసీఆర్, కేటీఆర్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లో కొంత భూమిని పేదలకు దానం చేయాలని కోరారు. మీరు ఫామ్ హౌజుల్లో జమీందారుల్లా బతుకుతారు... పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? అని ప్రశ్నించారు. అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్టును, అంబర్ పేట్ పోలీస్ ఆకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి పేదలకు ఇండ్లు కట్టిద్దామన్నారు. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండన్నారు. మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండని సీఎం అడిగారు. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదని హెచ్చరించారు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లు..  నెలరోజుల్లో మేం రూ.18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసామన్నారు. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్ ను కలవండని సూచించారు. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.