15-04-2025 03:09:55 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన శంషాబాద్ నోవాటెల్ హోటల్(Shamshabad Novotel)లో మంగళవారం నాడు శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. రేపటి నుంచి జూన్ వరకు ఎమ్మెల్యేలు పర్యటించేలా చూడాలన్నారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకమవుతానని వెల్లడించారు. గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షం ఏఏఐతో అబద్దపు ప్రచారం చేసిందని ఆరోపించిన ముఖ్యమంత్రి ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని చెప్పారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్తు ఉంటుందని పార్టీ నేతలకు సీఎం సూచించారు. తెలంగాణలో మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఉక్కిరి, బిక్కిరవుతున్నారని రేవంత్ అన్నారు. తెలంగాణ మోడల్ పై దేశంలో చర్చ జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. సమావేశం ముగిసిన అనంతరం హోటల్ నోవాటెల్ నుంచి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి జపాన్ కు పయనం కానున్నారు.