calender_icon.png 21 September, 2024 | 5:58 PM

జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

21-09-2024 04:08:20 PM

హైదరాబాద్: జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలన్న కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి..పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటు అన్నారు. ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని సీఎం కొనియాడారు.

వారిని కలిసి మాట్లాడినప్పుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గుర్తొచ్చేవారని తెలిపారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి సమకాలికుడుగా సీతారాం ఏచూరి ఉండేవారని గుర్తుచేసుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసమే చివరి శ్వాస వరకు నిలబడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు. ఆయన బ్రతికి ఉన్నంత కాలం పేదల కోసం పోరాడారు.. మరణాంతరం కూడా ఉపయోగపడాలన్న కుటుంబసభ్యుల నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. యూపీఏ హయాంలో  పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు తెలపడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని చెప్పారు.

రాహుల్ గాంధీ ఆయన్ను మార్గానిర్దేశకుడిగా భావిస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలన్న కుట్ర జరుగుతోందని తెలిపారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించాలనుకుంటున్న ఇలాంటి కీలక సమయంలో ఆయన లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరని లోటని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు. మనకు దిక్సూచీలా ఉండాల్సిన సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని, సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

విద్యార్థి దశ నుంచి దేశ క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన స్పూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి మాట్లాడితే ప్రధాని స్పందించకపోవడం వారి ఫాసిస్టు విధానాలకు నిదర్శనమన్నారు. అలాంటి భాషా ప్రయోగం చేసిన వారిని నియంత్రించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.