calender_icon.png 15 April, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డా.బీఆర్‌ అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

14-04-2025 10:22:11 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని చెప్పారు. 

డాక్టర్ అంబేద్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాబాసాహెబ్ స్వప్నాలను నిజం చేయడానికి అందరూ కలిసి పాటుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రలు దామోదార రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.