calender_icon.png 18 April, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ విషప్రచారం: సీఎం రేవంత్

15-04-2025 07:57:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమవేశంలో ప్రధానంగా నాలుగు ప్రధాన అంశాలపై చర్చించారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడంపై పార్టీ నేతలకు దిశానిర్ధేశ్యం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారం చూపిందని, ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం అని పేర్కొన్నారు. భూ భారతిని రైతులకు చేరవేయాలని, దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచిందని, నిజమైన లబ్ది దారులకు క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు అందాలన్నారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా నిర్వహించి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. కులగణన మన పారదర్శక పాలనకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేంతవరకు ఒక్క  ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని సూచించారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తానని వ్యాఖ్యానించారు. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫీషీయల్ ఇంటలిజెన్స్ తో అబద్ధపు ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నట్లు గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని, ఎన్ని అవరోధలు వచ్చిన పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుందని వివరించారు. 

మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తెలియజేయాలన్నారు. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండని, ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రమే అధికార పార్టీ నేతలపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారని గుర్తు చేశారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి, బిక్కిరి  అవుతున్నాడని, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందని కొనియడారు. కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోందని, దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోందన్నారు. అందుకే తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కటై కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతున్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు. సన్న బియ్యం మన పథకం..మన పేటెంట్, మన బ్రాండ్ అని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.