హైదరాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఆదివాసీ, మైనారిటీ వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చొరవ తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసంలో సమావేశాన్ని నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడాలని, స్థానికంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ సీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కారించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకు ఆదివాసీలు సహకరించాలని కోరారు. తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని కోరారు. ఆదివాసీల సమస్యలు సావధానంగా విన్న రేవంత్ రెడ్డి దీపావళిలోగా ఆదివాసీ సమస్యలపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.