24-02-2025 03:48:53 PM
హైదరాబాద్: బయోటెక్నాలజీ రంగంలో అగ్రశ్రేణి సంస్థ ఆమ్జెన్ ఇండియా ఫెసిలిటీ సైట్(Amgen India Facility Site)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమావారం నాడు ప్రారంభించారు. గత ఆగస్టులో అమెరికా పర్యటించిన సందర్భంగా ఆమ్జెన్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, తాజాగా మాదాపూర్లో ఆమ్జెన్ ఇండియా ఫెసిలిటీ సైట్ను ప్రారంభించింది. ఈ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన బయోటెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్ తన మొట్టమొదటి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్లో స్థాపించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి గత ఆగస్టులో శాన్ఫ్రాన్సిస్కోలో ఆమ్జెన్ ఆర్ అండ్ డీ సెంటర్ను సందర్శించినప్పుడు సైంటిఫిక్ ఇన్నొవేషన్, రీసెర్చ్, బయో టెక్నాలజీ, ఫార్మా ఆవిష్కరణలలో కంపెనీ నిబద్ధతను గమనించామని చెప్పారు.
ఆమ్జెన్ ఇక్కడకు రావడంతో బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఇన్నొవేషన్, టెక్నాలజీ హబ్గా ఉన్న హైదరాబాద్ నగరం(Hyderabad city) మరింత బలపడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం లైఫ్సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో ముందంజలో ఉందని సీఎం పేర్కొన్నారు. ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంలో ఎదగడం, ప్రపంచంలో చైనా ప్లస్ వన్ గమ్యస్థానంగా హైదరాబాద్ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా మార్చాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆమ్జెన్ భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి సాధించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి తెలంగాణ కట్టుబడి ఉందని చెప్పారు. పరిశోధనా రంగంలో, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, అకడమిక్ భాగస్వామ్య రంగాల్లో ఆమ్జెన్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ జెన్ చైర్మన్, సీఈవో రాబర్ట్ ఎ. బ్రాడ్వే, హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనలర్ జెన్నిఫర్ లార్సన్, ఆమ్జెన్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ డెరిక్ మిల్లర్ తో పాటు ఇతర ప్రముఖులు ప్రసంగించారు.