06-04-2025 02:14:11 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏదో ఒకరోజు లబ్ధిదారుల ఇళ్లో భోజనం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో ఆదివారం పర్యటించారు. భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించి నేరుగా సారపాకలోని సన్నబియ్యం లబ్దిదారుడు శ్రీను కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి భోజనం చేశారు. అనంతరం వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సతీమని గీతతో హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు కూడా భోజనం ఆరగించారు.