హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని, టాటా మరణం పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో విలువలు, నిబద్ధతకు కట్టుబడి ఉండే గొప్ప వ్యక్తి మాత్రమే కాదు, దాతృత్వానికి పర్యాయపదమని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. టాటా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రతన్ టాటా లెక్కలేనన్ని సేవలను అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాలలో ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. రతన్ టాటా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.