25-02-2025 01:06:02 PM
హైదరాబాద్: హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో బయో ఆసియా-2025(Bio Asia 2025 Summit) ప్రారంభోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. బయో ఏషియా-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బయో ఏషియా.. హైదరాబాద్ ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందన్నారు. హెల్త్ కేర్ రంగం(Health care sector) భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఏషియా దేశ విదేశాలను ఆకర్షిస్తోందని సీఎం వివరించారు. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ముందునుంచి పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో మా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి తాము ఇంతకాలం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టామన్నారు.
ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో శాస్త్ర నిపుణులు, ఇంజనీర్ల సమూహాన్నీ తయారు చేశాం, జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియా సేవల రంగానికి ప్రాధాన్యమిస్తామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ,ఏఐ (AI) సిటీ తో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా అవతరించిందని సూచించారు. దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇక్కడ జరుగుతున్నాయన్న ఆయన 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు.
కోర్ సిటీ వెలుపల అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మాన్యుఫాక్షరింగ్ హబ్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా దీన్ని నెలకొల్పుతామన్నారు. చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తామని, ప్రపంచం నలుమూలాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఓఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్... ఈ రెండు రింగ్లను రేడియల్ రోడ్లతో అనుసంధానిస్తామని వ్యాఖ్యానించారు. ఈ రహదారులకు ఇరువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం అన్నారు. ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి.. ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్ కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామని వెల్లడించారు.
బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నామని వెల్లడించారు. నిన్ననే హైదరాబాద్ లో అమ్జెన్ సంస్థ తమ కార్యకలాపాలను విస్తరించిందని సూచించారు. ఇది తమ సహకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, మా ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలని, తమతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రపంచస్థాయి దిగ్గజ కంపనీలన్నింటినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో, తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని గుర్తుచేశారు. విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయన్న సీఎం గత ఏడాది లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించామన్నారు.
దాదాపు 150పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు విస్తరించాయని చెప్పారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన చొరవ అయిన గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న ఆయన అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని తెలిపారు. జర్మన్ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్, జన్యు చికిత్సను ప్రారంభించిందన్నారు.
ఈ వేదికపై మరో నాలుగు బహుళజాతి కంపెనీలను తమ పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నామని వెల్లడించారు. గత 25 సంవత్సరాలలో, హైదరాబాద్ ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ పవర్ హౌస్గా పేరు నిలుపుకుందన్నారు. గత ఏడాది ఏఐ హెల్త్కేర్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించామని సీఎం గుర్తుచేశారు. దేశవిదేశాల నుంచి బయో ఏషియా సదస్సుకు హాజరైన ప్రముఖులు.. గొప్ప మనసున్న వారందరికీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మీరందరూ తెలంగాణను అనువైన వేదికగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పొందిన ప్రొఫెసర్ పాట్రిక్ టాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.