27-02-2025 04:20:35 PM
హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో హెచ్సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్ను ముఖ్యమంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ప్రస్తుతం హైదరాబాద్, తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా, రాష్ట్రంగా మారిందని చెప్పారు. హైదరాబాద్ పోటీ.. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు నగరాలతో కాదని, ప్రపంచ స్థాయి నగరాలతో తమ పోటీ అని అన్నప్పుడు అదో పెద్ద కలగా అభివర్ణించారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న తీరు నంబర్ 1 గా నిలిచినప్పుడు, రాష్ట్రాన్ని డేటా సెంటర్ల హబ్గా, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్, స్కిల్ డెవలప్మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ రంగాల్లో తెలంగాణను మార్గదర్శిగా మార్చినప్పుడు ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు.
బహుళజాతి కంపెనీలతో ప్రతి రోజూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్ కు రావడం లేదా గతేడాది కుదుర్చుకున్న ఎంఓయూల మేరకు సరికొత్త సౌకర్యాలతో సిద్ధమైన ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణ అంతర్జాతీయ, దేశీయ అత్యధిక పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ను ముందుగా అందిపుచ్చుకున్నాం. పైగా రాష్ట్రంలో తక్కువ ద్రవ్యోల్బణాన్ని కాపాడుకున్నామని తెలిపారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మార్చుతామని చెప్పినప్పుడు కొందరు సాధ్యం కాదన్నారు. కేవలం దావోస్ లో జరిపిన రెండు వ్యాపార పర్యటనల్లో 40 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు, 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని సూచించారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ సంస్థల్లో ఒకటైన ఆమ్ జెన్ ను హైదరాబాద్కు ఆహ్వానించామన్నారు. ప్రపంచంలోనే అత్తుత్తమ జీవ వైవిధ్య సదస్సుల్లో ఒకటైన బయో ఆసియా-2025 ను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఇప్పుడు హెచ్సీఎల్ క్యాంపస్ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. 60 దేశాల్లో డిజిటల్, ఇంజనీరింగ్, క్లౌడ్, ఏఐ(Artificial intelligence) రంగాల్లో 2.2 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ దేశ గౌరవాన్ని పెంచిందన్నారు. 2007 లో హైదరాబాద్లో తొలిసారి ప్రారంభమైనప్పటి నుంచి అభివృద్ధి సాధిస్తూ ప్రస్తుతం 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 వేల మంది ఉద్యోగులతో ప్రపంచస్థాయి సరికొత్త సదుపాయాలతో హైదరాబాద్ హెచ్ఎసీఎల్ అద్భుతమైన విజయాలను సాధించబోతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఎల్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి. విజయ్ కుమార్, సీవీపీ, డిజిటల్ బిజినెస్ గ్లోబల్ హెడ్ పవన్ వాడపల్లి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.