calender_icon.png 22 October, 2024 | 5:33 AM

మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ పూటకో మాట

22-10-2024 01:41:50 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి పూటకో మాట చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సోమవారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో లక్షా 50వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జులై 20న ప్రకటించారని, కానీ సెప్టెంబర్ 6న విడుదల చేసిన తెలంగాణ గ్రోత్ స్టోరీ ద రోడ్ టు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ విజన్ డాక్యుమెంట్‌లో లక్షా 50వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా పేర్కొన్నారని ఆయన తెలిపారు.

ఇటీవల మరో సభలో లక్షా 50వేల కోట్లు ఎవరన్నారంటూ  ఆవేశంతో ఊగిపోయారని, పూటకో తీరుగా మాట్లాడు తున్న ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని ఎద్దేవా చేశారు. బిడ్డ పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు డీపీఆర్ లేకుండా లక్షా 50వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వాలకే చెల్లుతుందని మండిపడ్డారు.

మూసీ రిజువినేషన్ అండ్ రివర్ ఫ్రంట్ పేరుతో ప్రజాధనం లూఠీ చేయాలనే కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేస్తామని పేర్కొన్నారు. రేవంత్ నిరంకుశ విధానాలను అడుగడుగునా ఎండగట్టి తెలంగాణ ప్రజల తరుపున నిలదీస్తామని హెచ్చరించారు.