calender_icon.png 26 October, 2024 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అజయ్‌బంగాతో సీఎం భేటీ

08-08-2024 01:28:17 AM

ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో గంటపాటు చర్చ

తెలంగాణ ప్రాజెక్టులకు సహకారంపై వినతి

స్కిల్ డెవలప్‌మెంట్, నెట్ జీరో..

ఫ్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై ఆసక్తి

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): తెలంగాణ అభివృద్ధి ప్రణాళికల్లో భాగం పంచుకునేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్‌బంగాతో ప్రత్యేకంగా సమావేశ మయ్యారు. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని నిర్ణయించారు.

ప్రధానంగా స్కిల్ డెవలప్‌మెంట్, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో, ఫ్యూచర్ సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నోస్టిక్స్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన చర్చలు జరిగాయి. సీఎం తోపాటు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆర్థికశాఖ ముఖ్య కార్య దర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణువర్ధన్‌రెడ్డి, అజిత్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరతతోపాటు వివిధ అంశాలపై చర్చించారు. 

హామీలన్నీ నెరవేరుస్తాం

ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ఎంతో ప్రాధాన్యం సంతరింకుంటు న్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన అమలుచేసి తీరుతామని ప్రకటించా రు. అన్నింటిలోనూ అత్యంత పారదర్శకతను పాటిస్తామని తెలిపారు. ప్రాంతాలవారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగా లకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనలను ప్రపంచ బ్యాంకు బృందంతో పంచుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంతోపాటు హైదరాబాద్ అభివృద్ధికి సీఎం అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుందని ప్రపంచబ్యాంకు బృందం అభిప్రాయపడింది. గతంలో భారత్‌లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేసింది. చర్చల సందర్భంగా నెట్ జీరో సిటీ అభివృద్ధిపై సీఎం చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం మరింత ఆసక్తిని ప్రదర్శించింది. తెలంగాణ ప్రభుత్వ తీరును ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు.