calender_icon.png 20 September, 2024 | 4:09 PM

యూరోపాపైకి క్లిప్పర్ మిషన్

17-09-2024 05:43:57 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: విశ్వంలో నీటి జాడలు కనుగొనేందుకు మనిషి చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాట్లు పూర్తి చేసింది. బృహస్పతి (జుపిటర్) ఉపగ్రహాల్లో ఒకటైన యూరోపాపై నీటి సముద్రాలు ఉన్నట్టు పరిశోధకులు ఎప్పటి నుంచో అనుమానిస్తున్నారు. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు యూరోపా క్లిప్పర్ మిషన్‌ను 5 బిలియన్ డాలర్ల వ్యయంతో నాసా చేపట్టిం ది. ఇప్పటికే ఈ ప్రోబ్ నింగిలోకి దూసుకుపోవాల్సి ఉండగా సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది.

అక్టోబర్ 10వ తేదీన స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా ఈ ప్రోబ్‌ను పంపనున్నారు. యూరోపా ఉపరితలం మొత్తం మంచుతో గడ్డకట్టి ఉంటుంది. ఆ మంచుకింద మహా సముద్రం ఉన్నట్టు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అందులోని నీరు మానవులకు పనికి వస్తుందా? లేదా? అన్న అంశంపై ఈ ప్రోబ్ పరిశోధన చేస్తుంది. అయితే యూరోపాపై తీవ్రమైన రేడియేషన్ ఉంటుంది. దీంతో ప్రోబ్‌లోని పరికరాలు ఆ రేడియేషన్‌ను తట్టుకొంటుందా లేదా అన్నదానిపై నాసా పరిశోధకుల్లో సందేహాలున్నాయి.